Wednesday, April 1, 2009

"చందమామ" అనుభూతులు మరపురానివి"


ఈ రోజు (01-04-09) రాత్రి అనుకోకుండా అంతర్జాలంలో సెర్చ్ చేస్తుండగా సంవత్సరం క్రితం ఓ చందమామ అభిమాని రాసిన కింది బ్లాగులు చూశాను. తెలుగునాడులో ఎంతమంది ఇలా చందమామతో తమ బాల్యజీవితంలోని తాదాత్మ్య క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ పలవరిస్తున్నారో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే చిరు ఆశతో... రామకృష్ణ అనే ఈ బ్లాగర్ రాసిన అమృతమయమైన పలుకులను ఇక్కడ నా బ్లాగ్‌లో చేరుస్తున్నాను. ఇంకా వికీ పీడియా, ఈనాడు, ఈమాట.కామ్ (http://www.eemaata.com/) తదితర పత్క్రికలలో వచ్చిన వ్యాసాలు, చందమామపై పరామర్శలు వంటి వాటని అన్నింటినీ గుదిగుచ్చి నాకు తెలిసిన అందరికీ పంపాలని కలకంటున్నాను.

రాజు.

http://omyfriend.blogspot.com/2008/03/blog-post_6846.html
httpomyfriend.blogspot.com2008_03_01_archive.html

మా ప్రియ మిత్రుడు రాంకీ వలన మన చిననాటి నేస్తం చందమామను గుర్తుచేసుకునే అవకాశం కలిగింది.ఈ సందర్భంగా చందమామతో నాకున్న అనుబంధాన్ని నెమరువేస్తున్నాను.నా చిన్న తనంలో నాకు పుస్తక పఠనంపై అంతగా ఆశక్తి ఉండేది కాదు. కొబ్బరి మట్టలతో, తాటిటెంకలతో మొదలెట్టిన బంతాట(క్రికెట్) రెండు రూపాయల రబ్బరు బంతి కొని చెక్క బ్యాటుతో ఆడేవరకూ వచ్చింది. బంతి ఉంటే ఏడుపెంకులాట, బ్యాటు కూడా ఉంటే క్రికెట్, రెండూ లేకపోతే చెడుగుడు. ఇలా గడచిపోతున్న కాలంలో ఒకమారు మా సుశీలాబాయి టీచర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో చాలా పుస్తకాలు ఉండడం చూసాను. వాళ్ళబాయి మధు నా ఈడు వాడు కావడంతో ఇద్దరం కూర్చోని బొమ్మరిల్లు, చందమామ చదివాం. నా చేతిలో చందమామ బొమ్మరిల్లుతో పొలిస్తే కొంచం చిన్నదిగా అనిపించింది, అందుకని వెంటనే పుస్తకాలు మార్చుకుని చూసాను, రెండిటిలో చందమామే బావుందనిపించింది, ఎందుకో తెలియదు. అలా మొదలైన చందమామ పరిచయం కొన్నాళ్ళకి ఆగిపోయింది.
ఒక రోజు క్రికెట్ ఆడుతుండగా ఒక మిత్రుడు బాలమిత్రలోని ఒక మిని నవల కథ చెప్పాడు. అది ఒక రక్త పిచాచి కధ. అది నిజమో కాదోనని తను ఎక్కడ చవివాడో కనుక్కొని అక్కడకు వెళ్ళాను. అది శాఖా గ్రంధాలయం. బజారు దగ్గరే ఒక హోటల్ పక్కగా ఎవరికి బయటకు కనపడనట్లుగా ఉండేది. ఆ రోజు మొదలు నాలుగు సంవత్సరాలు, ఎనిమిదో తరగతి వరకూ ఒక్క చందమామను కూడా వదల లేదు. ఎప్పుడు కూరగాయల కోసం బజారుకెళ్ళినా అక్కడ కనీసం పావుగంటైనా ఉండాల్సిందే. భేతాళ కథలు, రామాయణం వంటి సీరియల్స్ తో మొదలుకొని , ఒక అయిదారు మూడు పేజీల కథలు, రెండు మూడు పిట్ట కథలు, పాతికేళ్ళనాటి చందమామ కథ, ఒక విదేశీ కథానువాద, వింత వార్తలు, ఇలా సాగేది ప్రస్థానం.
బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటివెన్ని ఉన్నా చందమామ స్దానం చందమామదే!!!
Posted by హరి - HARI at 11:15 AM 0 comments Links to this post
తరాలను తీర్చిదిద్దిన చందమామ మా నాన్నగారు మాకు నేర్పిన ఒక మంచి అలవాటు పుస్తకాలు చదవడం. మాకు చిన్నతనంలోనే రామాయణ, భాగవతాలను పరిచయం చేశారు. అప్పట్లో రాజమండ్రి నుంచి గొల్లపూడి వీరాస్వామీ & సన్స్ వాళ్ళు తెలుగులో ముద్రించే బాలల బొమ్మల రామాయణం, మహాభారతాలు, ఇంకా తెనాలి రామకృష్ణ, బీర్బల్ కథలు, గద్య భాగవతం ఇలాంటి పుస్తకాలెన్నో మాకు చిన్నతనంలోనే కొని ఇచ్చి చదివించేవారు. అప్పటికి టి.వి. ఇంతటి విశ్వరూపం ధరించలేదు, ఆ పల్లెటూళ్ళో మాకు ఉండే సరదాలలో కధల పుస్తకాలు సింహభాగం వహించేవి.
నాలగవ తరగతిలో ఉండగా అనుకుంటాను,ఒకసారి నాన్నగారు మా ముగ్గురిని తీసుకుని మా ఇంటికి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న శాఖాగ్రంధాలయానికి తీసుకుని వెళ్ళి మాకు ఒక క్రొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. చిన్నఫ్ఫుడు చాలా ఇష్టంగా చదివింది చందమామ పుస్తకం. ప్రతి నెలా సుమారు 7 లేదా 8 వ తారీఖులలో మా గ్రంధాలయానికి వచ్చేది. ఇది కాకుండా బాలజ్యోతి, బుజ్జాయి కూడా వచ్చేవి. ప్రతి నెలా క్రొత్త చందమామ చదివే వరకు ఎంతో ఆతృతగా ఉండేది. నేను వెళ్ళేసరికి అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే నేను ఇంక అతని ప్రక్కనే కూర్చుని ఎప్పుడు వదులుతాడా అని చూసేవాడిని. చందమామ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చదివేవారు, ఒకవేళ పిల్లలు వచ్చినపుడు చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే అక్కడ ఉండే లైబ్రేరియన్ వాళ్ళ దగ్గర తీసేసుకుని మాకు ఇప్పించేవాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చేదే వీటి కోసం, వాళ్ళు లేనప్పుడు మీరు చదవండి అని వాళ్ళకి చెప్తుంటే ఆయనమీద ఎంతో ఇష్టం కలిగేది.
చందమామ కధలు ఏవి కూడా ప్రస్తుత కాలమాన పరిస్తితులలో ఉండవు, అందులో ఉండేదంతా ఒక ఐడియల్ ప్రపంచం. వాటిలో దెయ్యాలు, రాక్షసులు, మంత్రగాళ్ళు, గయ్యాళి అత్తలు,దొంగలు అందరూ ఉండేవారు. కానీ ఎవ్వరూ మరీ క్రూరంగా ప్రవర్తించరు. కధా చివరిలో చెడ్డవాళ్ళు అందరూ మారిపోయినట్టు చూపేవాళ్ళు. ప్రతి కధలోను ఒక నీతి సూత్రం ఉండేది, సమాజానికి కావలసిన ఎదో ఒక విలువని భోధించేటట్టుగా ఉండేవి. నీతి సూత్రం కానీ, తత్వశాస్త్రం కానీ మనకి సోదోహరణంగా వివరిస్తే బాగా అర్దం అవుతుంది, అందుకే వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే నీతి సూత్రాలన్నీ మనకి కధలలో చేర్చి జనానికి అర్దమ అయ్యే విధంగా రామాయణ, భాగవతాలల రూపంలో చెప్పారు కదా. చదమామలో ఎత్తుగడ కూడా ఇదే, ఒక కధ చెప్పి అందులో ఎలా ప్రవర్తించకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో చిన్నపిల్లలకి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తుంది. పూర్వకాలంలో గురుకులాలలో ఇలా కధల ద్వారా నీతిని చెప్పడం (చిన్నయసూరి పంచతంత్రం లో కధల ద్వారా మూర్ఖులయిన రాజకుమారులను మార్చినట్టు) ఉండేది, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలో అది సాధ్యం కావడంలేదు, అమ్మ నాన్నలకు కధలు చెప్పే తీరిక ఉండదు, సరిగ్గా ఇక్కడే చందమామ ఒక అద్భుతమయిన పాత్ర పోషించింది. మన పురాతన విద్యావిధానంలోని కధాసాంప్రదాయాన్ని ముద్రణా వ్యవస్థ ద్వారా చిన్నారులకు అందించింది.
చిన్న చిన్న కధల ద్వారా నీతిని భోధించడమే కాదు, లౌక్యంగా ఎలా ఉండాలో చందమామలోని గడసరి కోడళ్ళు చెప్పేవారు. ఒక విషయాన్ని వేరే విధంగా ఎలా అలోచించాలో (లేటరల్ థింకింగ్), నాణేనికి రెండో వైపు చూడడం ఎలాగో భేతాళ కధల ద్వారా నేర్పేది. అందులో ఉండే బొమ్మలు (వడ్డాది పాపయ్య బొమ్మలయితే మరీను) మనలను చదివించేటట్టు పురికొల్పుతాయి. ప్రతి పేజీలోను ఒక బొమ్మ తప్పకుండా ఉండేది.నేను ఈరోజు మంచీ చెడూ, తప్పూ ఒప్పూ అలోచించగలుగుతున్నాను అంటే దానిలో చందమామలో చదివిన కధల ప్రభావం చాలా ఉంది. మా ఊరి లైబ్రరీ గోడ మీద ముట్నూరి కృష్ణరావు గారి మాటలు ఇలా రాసి ఉండేవి " ఎంత పెద్ద రాజభవనం అయినా అందులో పుస్తకాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను" అని. ఈరోజు నా సరదాలలో సినిమాలు, టి.వి, అంతర్జాలం ఎన్ని వచ్చినాకానీ క్రొత్త పుస్తకం చూడగానే ఏదో తెలియని ఆనందం, అది చందమామ అయితే నిజంగా చిన్నపిల్లవాడిని అయిపోతాను.
కాలం చాలా శక్తివంతమయింది, సమస్త ప్రపంచం కాల ప్రభావానికి లోను అవుతుంది, చందమామ కూడా. కాలవశాన చందమామ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇదివరకు వచ్చే కధలు, అప్పటి భాషా చందమామలో ఇప్పుడు కనిపించడం లేదు. నాకు అనిపిస్తూ ఉండేది, చందమామలోని పాత కధలన్నీ తిరిగి ముద్రించుకుంటూ పొతే బాగుండు అనీ, వారి దగ్గర 60 సంవత్సరాల బాల సాహిత్యం ఉంది, అది రాబోయే తరానికి పరిచయం చేస్తే బాగుండు అనీన్నూ. ఈ మధ్య వారు మొదలుపెట్టిన అంతర్జాల ఎడిషన్ ద్వారా ఇది తీరగలదు అని సంతోషంగా ఉంది. ఎన్నో తరాలని తీర్చిదిద్దిన చందమామ రాబోయే తరాలకోసం సిద్దం అవుతోంది.
Posted by రామకృష్ణ బైసాని at 1:54 AM 2 comments Links to this post

Sunday, February 22, 2009

ఆస్కార్‌ వేదికపై ఎఆర్‌ రహమాన్‌ జయహో

ఇండియన్‌ మ్యూజిక్‌ లెజెండ్‌ ఎఆర్‌ రహమాన్‌ అస్కార్‌ కల నిజమైంది. ప్రపంచంలో అత్యుత్తమ సినిమా పురస్కారం అయినటువంటి ఆస్కార్‌ అవార్డును దక్కించుకొని తన సత్తాను చాటారు. ఒకటి కాదు రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని ఆస్కార్‌ వేదికపై జయహో అనిపించారు. సినీ సంగీత జగత్తులో తనకు తిరుగులేదని ప్రపంచానికి చాటారు.

లాస్‌ఎంజెలెస్‌లోని కొడాక్‌ థియేటర్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రహమాన్‌ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్ ఒరిజనల్‌ స్కోర్‌ కేటగిరీల్లో రెండు అవార్డులను అందుకున్నారు.

రహమాన్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులుప్రపంచ సినిమా చరిత్రలో భారతీయ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎఆర్‌ రహమాన్‌ చరిత్ర సృష్టించారు. అందరూ ఊహించినట్లుగానే మన సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌ జయహో అనిపించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికి అద్భుత సంగీతాన్నందించిన రహమాన్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు లభించాయి. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఒకటి, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో రహమాన్‌కు మరో ఆస్కార్‌ దక్కింది. దీంతో స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికి ఆరు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి.


మన రెహ్మాన్‌కు ఒకటికాదు రెండు ఆస్కార్‌లు లభించాయి. భారతీయ సంగీతం అంతర్జాతీయ వేదికపైప్రతిధ్వనించింది. ఆస్కార్‌ అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. బెస్ట్‌ మ్యూజిక్‌కు, బెస్ట్‌ ఒరిజినల్‌ మ్యూజిక్‌కుగాను రెహ్మాన్‌కు రెండు ఆస్కార్‌లు లభించాయి. అవార్డు లభించగానే హర్షధ్వానాలతో ఆస్కార్‌ ప్రాంగణం దద్దరిల్లింది

భారతీయ చిత్రానికి ఆస్కార్

రెహ్మా‌న్‌కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భంలోనే మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీల కేటగిరీలో 'స్మైల్‌ పింకీ' చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గ్రహణం మొర్రి కారణంగా నవ్వటమే మరిచిపోగా ఓ డాక్టర్‌ దాన్ని సరిచేసి తిరిగి ఎలా నవ్వేలా చేశారో, అందరి పిల్లలతో తానూ సమానమే అన్నఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్పించారో ఇందులో చూపించారు.

స్లమ్‌డాగ్‌కు బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు

లాస్‌ఎంజెలెస్‌ : ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల్లో భారతీయ చిత్రం స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ విజయపథాక ప్రారంభమైంది. స్లమ్‌డాగ్‌కు బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే అవార్డు లభించింది. సైమన్‌ బ్యూఫై ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు.


9 విభాగాల్లో 10 నామినేషన్లు సంపాదించిన స్లమ్‌డాగ్‌కు ఒక అవార్డు వచ్చింది. అయితే భారతీయ సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌కు అవార్డు వస్తుందా రాదా అని 100 కోట్లమంది భారతీయుల్లో ఉత్కంఠ నెలకొంది. భారతీయుడైన వికాస్‌ స్వరూప్‌ రాసిన నవల ఆధారంగా స్లమ్‌డాగ్‌ చిత్రం తెరకెక్కింది.

ఆస్కార్ అకాడమీ ఆవిర్బావ చరిత్ర

1927 ప్రారంభంలో బీజం పడింది. ఎంజిఎం స్టూడియో చీఫ్‌ లూయిస్‌ బి. మేయర్‌ తన ముగ్గురి మిత్రులతో(దర్శకుడు ఫ్రెడ్‌ నిబ్లో, నిర్మాత ఫ్రెడ్‌ బెట్సన్‌, నటుడు కరద్‌ నగేల్‌) కలిసి ప్రపంచవ్యాప్తంగా చిత్రపరిశ్రమకు ఏదైనా మేలు చేసే విధంగా ఒక సంస్థను నెలకొల్పాలనే వీరి ఆలోచనే ఆస్కార్‌ మోషన్‌ పిక్చర్స్స అకాడమీ ఏర్పాటుకు దారితీసింది. ఈ నలుగురు కలిసి లాస్‌ ఎంజెలెస్‌లోని అంబాసిడర్‌ హోటల్‌లో (జనవరి 11 1927లో) ఇంటర్నేనేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్‌‌ట్స అండ్‌ సైన్సెస్‌ రూపకల్పనకు ఓ ప్రపోజల్‌ను తయారు చేశారు.
డగ్లస్‌ ఫెయిర్‌బ్యాంక్‌, మేరీ పిక్‌మన్‌ మరో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. వీరే అకాడమీ వ్యస్థాపకులుగా చరిత్రలో నిలిచారు. తరువాత అందులోని ఇంటర్నేషనల్‌ను తొలగించారు. అనంతరం వెంటనే ఈ కాన్సెప్టును హాలీవుడ్‌ చిత్రపరిశ్రమలోని ప్రముఖులంతా మెచ్చుకోవడంతో మే 11, 1927న ప్రభుత్వం అకాడమీకి చార్టర్‌ను మంజూరు చేసింది. అనంతరంలో అకాడమీలో 300 మంది సభ్యులు చేరడం, అకాడమీ కోసం100 డాలర్లు సహాయం చేయడం చాలా వేగంగా జరిగింది.
మొదట ప్రారంభంలో ఐదు విభాగాల్లో ( నిర్మాతలు, నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు) ఈ అకాడమీని ప్రారంభించారు. ఈ అకాడమీకి మొదటి అధ్యక్షుడు (1927-29 వరకు) డగ్లస్‌ ఫెయిర్‌బ్యాంక్‌ వ్యవహరించగా రెండో అధ్యక్షుడు (1929-31) విలియం డెమిలీ వ్యవహరించారు. ఇప్పటి వరకు 32 మంది అధ్యక్షలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆస్కార్‌ మోషన్‌ పిక్చర్స్ అధ్యక్షునిగా సిడ్‌ గ్యానిస్‌ వ్యవహరిస్తున్నారు. అకాడమీ ఆధ్వర్యంలో 1929 మే 16న రూజ్‌వెల్ట్ హోటల్‌లో మొదటి ప్రదానోత్సవం జరిగింది. ప్రస్తుతం 81వ అస్కార్‌ మోషన్‌ పిక్చర్‌ అవార్డు ప్రదానం జరుగుతోంది.

2008 ఆస్కార్‌ అవార్డుల జాబితా...

కోట్లాది మంది భారతీయుల ఆశల్ని మోస్తూ ఆస్కార్‌ బరిలో ఎఆర్‌ రహమాన్‌ గెలిచారు. తమ అభిమాన మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఈ అవార్డు దక్కాలని ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా చేస్తున్న పూజలు ఫలించాయి. మ్యూజిక్‌ సామ్రాట్‌గా, ఉపఖండాన్ని ఉర్రూతలూగించిన రహమాన్‌ ఆస్కార్‌ అందుకున్నాడు. అండ్‌ ద అవార్డు గోస్‌ టు ఎఆర్‌ రహమాన్‌ అనే వ్యాఖ్యాత పిలుపు వినగానే వందకోట్ల మంది భారతీయులు హృదయాలు ఒక్కసారిగా లయ తప్పాయి. క్షణం తర్వాత హర్ష ధ్వానాలు. ఆస్కార్ అవార్డుల ప్రాంగణం దద్దరిల్లేలా.. ఆ చప్పట్లు ప్రపంచం నలుమూలల్లో టీవీలకు అతుక్కుపోయి చూస్తున్న భారతీయుల గుండెల్లో మారుమ్రోగాయి. మన వాడు, చరిత్రలో ఓ భారతీయుడు స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఆస్కార్ బెస్ట్ ఒరిజనల్ సాంగ్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
స్లమ్‌డాగ్‌కు 7 ఆవార్డులు
1. బెస్ట్ ఒరిజనల్‌ సాంగ్‌ : ఎఆర్‌ రహమాన్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)2. బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌ : ఎఆర్‌ రహమాన్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)3. బెస్ట్ అడాప్టెడ్‌ స్క్ర్రీన్‌ప్లే : సైమన్‌ బ్యూఫోయ్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)4. బెస్ట్ సినిమాటోగ్రఫి : అంటోని డాడ్‌మాంటల్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్)5. బెస్ట్ సౌండ్‌ మిక్సింగ్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)6. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌ : క్రిస్‌ డికెన్‌‌స (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)7. బెస్ట్ డైరెక్టర్‌ : డానీ బోయెల్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)
ఉత్తమ సహాయనటి : ఫెనలోపీ క్రూజ్‌ ( వికీ క్రిస్టీనా బార్సీలోనా చిత్రం)
ఉత్తమ సహాయనటుడు : హీత్‌ లెడ్జర్‌ ( ది డార్క్ నైట్‌)
బెస్ట్ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్ : అండ్రూస్టాంటన్‌ (చిత్రం-వాల్‌ ఈ)
బెస్ట్ యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్: లా మైనస్‌ ఎన్‌ పెటిట్‌‌సక్యూబ్స్
ఉత్తమ లఘు చిత్రం : టాయ్‌లాండ్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : మైకేల్‌ ఒకానర్‌ ( చిత్రం-ది డచెస్‌)
మేకప్‌ : గ్రెగ్‌ కాసమ్‌ (ది క్యూరియస్‌ ఆఫ్‌ బెంజమిన్‌ బట్టన్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్.

Thursday, February 12, 2009

మామా... చందమామా...

నా చిన్నప్పుడు ఒక పున్నమి రాత్రి మాయమ్మ మమ్మల్ని ఒడిలో కూర్చొండబెట్టుకుని చంద్రుని కథ చెప్పింది. వెన్నెలకు ఆ చల్లదనం ఎలా వచ్చింది అనేదే ఆ కథ. చంద్రుడి వెన్నెల చల్లదనం గురించి "చందమామ" మాసపత్రిక అప్పట్లో చెప్పిన మరుపురాని మానవీయ కథ ఇది. ఇక్కడ మా ఊర్లో మా చిన్నతనంలో చందమామ పత్రిక మాకు ప్రసాదించిన జ్ఞానం గురించి కొంత నేపథ్యం తెలుసుకుంటే మంచిదనుకుంటా...

కడప జిల్లా రాయచోటి తాలూకా సుండుపల్లి మండలంలో బాహుదా (చెయ్యేరు) నది దాటితే వచ్చే మా ఊరులో దాదాపు ముప్పై లేదా ముప్పై అయిదేళ్లకు ముందు మా కుటుంబం (నలుగురు అన్నదమ్ములు, వారి పిల్లలు, అవ్వాతాతలు కలిసి 30మంది) మొత్తం ఇంటికొకటి చొప్పున చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి కథల పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకునేది. వాటిని చదవడంలో పెద్దలు, పెదపెద్దలు, పిల్లలు, పినపిల్లలు అంతా పోటీలు పడేవాళ్లం. వ్యవసాయపనుల్లో అందరూ మునుగుతున్నందున ఎవరికి తీరిక ఉంటే వారు కథ చదివితే తక్కినవారి వంతు తర్వాత వచ్చేది.

అయితే ఆ రోజుల్లో సీరియల్‌గా మహాభారతం, రామాయణం, భాగవతం కథలు, భేతాళ కథలు వంటివి వచ్చేవి కాబట్టి ముందుగా చదవని వారు ఈ నెల ఫలానా కథ ఏమైంది అని అప్పటికే చదివిన వారిని అడగటం, వారు యథాశక్తిగా తమ తీరులో కథను చెప్పటం, తర్వాత పుస్తకం వంతులు మారి చేతికొచ్చినప్పుడు మళ్లీ ఆ కథలను చదివి మననం చేసుకోవటం ఇలా మా చిన్నతనంలో -1970-77- ఏళ్ల తరబడి ఈ కథా పారాయణం, పఠనం సాగుతూ వచ్చింది. పుస్తకాన్ని కొని చదివే స్తోమత, సాహిత్య పరిచయం కలిగిన తెలుగు కుటుంబాలకు 60, 70 ల కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చేమో...

ఈ నేపథ్యం నుంచి బయటకి వస్తే చందమామకు ఆ చల్లదనం ఎక్కడినుంచి వచ్చింది.... ఏ మహత్తర క్షణంలో మా అమ్మ చందమామ చల్లదనం గురించి చందమామ పత్రికలో వచ్చిన ఆ వెన్నెల రాత్రి కథను చల్లగా చెప్పిందో కాని ఈ రోజుకూ కథ విన్న ఆ రాత్రినీ, ఆ అనుభూతినీ, అది రేపెట్టిన ఆలోచనలను మర్చిపోలేకున్నానంటే నమ్మండి. చందమామలో ఆ నాడు వచ్చిన, అమ్మ చెప్పిన ఆ చల్లదనపు కథను నేను గుర్తుపెట్టుకున్నంతమేరకు చెబుతున్నా వింటారా.... చదవటం కూడా వినటంతో సమానమే కదా..

సూర్యుడు, వరుణుడు, అగ్ని, చంద్రుడు ఈ నలుగురికీ ఒకే తల్లి అట. అల్లారు ముద్దుగా ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా ఆ తల్లి తన పిల్లలను పెంచి పెద్ద చేసిందట.. ఒకరోజు దేవతలలో ఎవరో ఒకరికి పెళ్లి జరుగుతోందట...వీళ్ల తండ్రి పనిమీద బయటకు వెళ్లాడట. -దేవతలకు పని ఏముంటుంది అని అడగకండి వాళ్ల స్థాయిలో వాళ్ల పనులు వాళ్లకుంటాయి కదా...కంటెంట్ ప్రొవైడర్లకు, లోకలైజర్లకే కాక కార్పొరేట్ ఆఫీసుల్లో ఎడిటర్లకు, మేనేజర్లకు కూడా వాళ్ల స్థాయి పని వాళ్లకున్నట్లు మరి-

పాపం మరి భర్త లేనప్పుడు ఎంత దేవతా స్త్రీ అయితే మాత్రం ఆ సూర్యవరుణాగ్నిచంద్ర మాత తన ఇల్లు విడిచి బయటకు పోవచ్చా మరి. పోకూడదు కదా... అలాగని పెళ్లికి హాజరు కాకపోతే ఆ పెళ్లాడే దేవతా కుటుంబం ముఖం మళ్లీ చూడాలాయె. అందుకన్జెప్పి తాను పోకున్నప్పటికీ తన పిల్లలను ఆ పెళ్లికి పంపించిందామె.

అలా పిల్లలను పెళ్లికి పంపుతూ తల్లి ఒక మాట చెప్పింది. నాయనా... పెళ్లి పందిర్లో ఎవరితో గొడవపడకండి, అల్లరి చేయకుండా, తోటి పిల్లలతో కొట్లాడకుండా పదిమందిలో పేరు తెచ్చుకోండి. మన ఇంటి పేరు నిలబెట్టండి.. ఇలాంటి బుద్ధి మాటలు చెబుతూ చివరలో పెళ్లి విశేషాలను తిరిగొచ్చాక వివరంగా చెప్పమంది. పెళ్లికి పోయినందుకు గుర్తుగా ఏదైనా అక్కడినుంచి తీసుకురమ్మని చెప్పింది.

తల్లి మాటలకు "ఓ" అన్నారు పిల్లలు. తల్లి సాగనంపింది. నలుగురు పిల్లలూ ఏ ఒకరూ తనకు ఎక్కువా కాదు తక్కువా కాదు. పేగు బంధం భేదమెరుగదు కదా..వెళుతున్న పిల్లలకేసి చూస్తూ ఆలోచనలతో ఇంటి మార్గం పట్టింది. మరోవైపు ఈ నలుగురూ పెళ్లికెళ్లారు. మాట ప్రకారం మెత్తగా, ఎవరితో గొడవపడకుండా గడిపారు. ముహూర్తం రాగానే అక్షంతలు చల్లారు. తంతు పూర్తి కాగానే విస్తళ్లు పడ్డాయి. పోటీగా పరుగెత్తి భోజనాలకు కూర్చున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు సుష్టుగా భోంచేశారు. ఇకేముంది తోటి పిల్లలకు వస్తామంటూ చెప్పి బయలుదేరారు.

ఇంటికి రాగానే తల్లి దగ్గరకు తీసుకుని ముద్దాడింది. పెళ్ళి విశేషాలు నలుగురు పిల్లలనూ అడిగి మరీ తెలుసుకుంది. తర్వాత తీరిగ్గా అడిగింది. "పెళ్లి గుర్తుగా నాకేమన్నా తెచ్చారామ్మా" అంటూ....పెద్దవాడు సూర్యుడు బిక్కచూపులు చూశాడు. నడిపోడు వరుణుడు తేల ముఖం వేశాడు. చిన్నోడు అగ్ని పాలిపోయాడు. అమ్మ చెప్పిన మాట మర్చిపోయారుగా. ఇక కట్టకడపటివాడు చంద్రుడు..తల్లి పిలిచింది. తలమీద చేయివేసి హత్తుకుంది. "నువ్వు కూడా ఏమీ తేలేదామ్మా" అంటూ చిన్నబోయిన స్వరంతో అడిగింది.

"తేకేం.. తెచ్చానమ్మా పెళ్లి భోజనంలో లడ్డూ కారాలు పెట్టారు.. లడ్డు కొంత తిని కొంత ఇదిగో నా గోట్లో పెట్టుకుని తీసుకొచ్చా.." అంటూ గోట్లోంచి తుంపిన లడ్డుముక్క తీసి తల్లి చేతిలో పెట్టాడు. (గోట్లో ఎంత లడ్డుపడుతుంది అని అడగకండి.. అవి దేవతల గోళ్లు..) "తింటూంటే నువ్వు చెప్పింది గుర్తుకొచ్చింది. జేబులో పెట్టుకుంటే తింటున్న పక్కవారు చూసి నవ్వుతారు కదా అని పట్టినంత ముక్క గోటిలో పెట్టుకుని తీసుకొచ్చా" అంటూ చెప్పాడు మెత్తగా....

తల్లి గుండె నీరయింది. కంట నీరు చిప్పిల్లింది. మాతృహృదయం ఒక్కసారిగా ఒణికింది. ఆబగా పిల్లాడిని కౌగలించుకుంది. జుట్టు చెరిపింది. సంతోషంతో తల్లి కడుపు సగం నిండిపోయింది. చాలమ్మా.. నువ్వయినా మాట గుర్తు పెట్టుకున్నావు. చెప్పిన మాట నిలబెట్టావు అంటూ మనసారా నవ్వింది. అంతలోనే రోషకషాయిత నేత్రాలతో పెద్దపిల్లలకేసి చూసింది. నిజంగా వణికిపోయారు వాళ్లు. వాళ్లకేసి తీవ్రంగా చూస్తూ ఇలా శపించింది.

"మీరు పెళ్లిలో తిన్నదాంట్లో భాగం అడగలేదురా నేను...తల్లిని నన్ను మర్చిపోవద్దన్నానంతే.. ఏదైనా గుర్తుగా తీసుకురమ్మని చెప్పాను. మరి కనీసం తల్లి మాటను గుర్తు పెట్టుకోలేకపోయారు మీరు. అందుకే తల్లి మనసును బాధించిన మీరు ఎంత మంచిపని చేసినప్పటికీ లోకంచే తిట్లు పడుతూ ఉండండి కలకాలం" అంటూ శపించింది.

పెద్ద కొడుకులకు శాపాల వరాలు పూర్తయ్యాక చిన్నపిల్లాడికేసి చూసింది. "పెళ్లి తీపి తెచ్చినందుకు, తినిపించినందుకు కాదురా.... నా మాట గుర్తుపెట్టుకున్నావు. అంతే చాలు నాకు..తల్లి మనసును సంతోషపెట్టావు. జన్మకిది చాలు.. ఈ క్షణం తల్లిగా నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నువ్వు కలకాలం లోకమంతటికీ పంచెదవు గాక" అంటూ దీవించింది.

ఇంకేముంది ఆ రోజే సూర్యచంద్రాదుల గతులు నిర్దేశించబడ్డాయట. నలుగురూ లోకకళ్యాణంకోసమే పాటు పడుతున్నప్పటికీ ఆ ఆరోజునుంచి తొలి ముగ్గురూ లోకంలో అందరిచేత తిట్లు, శాపనార్థాలు తింటూ ఉండసాగారు. ఎందుకో తెలుసా...

సకల జీవులకు వెలుగునిచ్చే సూర్యుడు మార్తాండావతారమెత్తి ఆయా పనులు చేసుకునే వారికి ఉక్క పుట్టించి చెడతిట్లు తింటాడు గదా... మరి వరుణుడు.....సకల పంటలకూ, ఫలాలకు, ఫలితాలకు కారకుడైనప్పటికీ అడ్డదిడ్డంగా వర్షాలు కురిపించి, తుపానులు పుట్టించి, ఊర్లకు ఊర్లనే లేపుతూ ప్రపంచంలో ఏదో ఓ చోట ప్రతిరోజూ అకాలవర్ష బాధ్యుడిగా, అతివృష్టి కారకుడిగా జనం శాపనార్థాలకు గురవుతుంటాడు గదా..

ఇక పోతే అగ్ని. భూమిని పునీతం చేసే పని. సకల వ్యర్థాలు, చెత్తలను తనలో మరిగించుకుని కొత్త సృష్టికి నాంది పలికే పని. పనికిమాలినదాన్ని ఎంత తగులబెట్టి అరగించుకున్నప్పటికీ, శాపకారణంగా మనుషులకు ఉపయోగపడే వాటిని కూడా లాగించేస్తుంటాడు. ఎంతమంది కొంపలు ఆ రోజునుంచి ఆర్పేశాడని మరి....ఎన్ని ఊళ్లను మటుమాయం చేశాడని...తల్లి శాపం తగిలిన క్షణంలో అడుగుపెట్టిన చోటల్లా భస్మీపటలమే కదా. మరి తిట్లు గాక దీవెనలు దక్కుతాయా...

మరి చంద్రుడూ... సొంత అన్నలు కూడా గమనించనంత జాగ్రత్తగా పెళ్లి లడ్డును తుంపి గోటిలో ఉంచుకుని తెచ్చి తల్లికి ఇచ్చాడు కదా. ఆ అభిమాన బలం ఊరకే పోతుందా మరి..అందుకే తల్లి దీవెన ఫలించి చల్లటి జీవితం దక్కింది. తన ఈ చిన్ని కార్యంతో తల్లిని సంతోషపెట్టిన వాడు, తల్లి మనస్సును చల్లబరచిన వాడు...సమస్త లోకానికే చల్లదనం పంచి ఇచ్చే మహా వరం పొందాడు.

ఆనాటినుంచి ఈనాటిదాకా చంద్రుడు ఎక్కడ అడుగుపెట్టినా చల్లదనం పారాడుతుంది. సమస్త జీవరాశులూ పిండి వెన్నెలను ఆస్వాదించి పరవశిస్తాయి. తల్లి మనసులో చల్లదనం పోసిన చంద్రుడు సూర్యవరుణాగ్నుల అసందర్భ క్రియలనుంచి లోకాన్ని కాపాడి అందరికీ వెన్నెల చల్లదనాన్ని పంచిపెడతాడు...అన్నిటికంటే మించి చంద్రుడి కంటే మించిన సోషలిస్టు, సమానత్వ వాది ఈ ప్రపంచంలోనే దొరకడేమో కదా...

సూర్యుడు బలవంతులనూ ధనవంతులనూ తాకలేడు వేధించలేడు. ప్రాచీన మధ్యయుగాలలో భారీ ఎత్తు మందపు రాతి కట్టడాలు సూర్యుడి బారినుంచి రాజులను చక్రవర్తులను, నిచ్చెన మెట్ల పైభాగంలో ఉన్నవారిని కాపాడితే ఇప్పుడు ఎసి ఉన్న మారాజులు సూర్యుడి వేడిని ఏ మాత్రం లెక్క చేయరు. రాజమందిరాలు, ధనికుల సౌధాలు అప్పుడూ ఇప్పుడూ కూడా వరుణుడి ప్రతాపానికి, మహోగ్నిజ్వాలలకు బెదిరిపోవు, చెదిరిపోవు..

మరి చంద్రుడి విషయానికి వస్తేనో....చంద్రుడు నిజంగా పేదల మనిషి. రాజాంతఃపురాలకంటే ఆకాశ హర్మ్యాల కంటే అపార్ట్‌మెంట్ బతుకులకంటే మిన్నగా చంద్రుడు పేదలపట్లే పక్షపాతం చూపిస్తాడు. చంద్ర వెన్నెల సోయగం నిజంగా పేదల గుడిసెలలోనే తారాడుతుంది. సామాన్యుల ఇళ్లలోనే వెన్నెల తెల్లగా వెల్లివెరుస్తుంది. తాపం బారిన పడే జనాలకు నిజమైన స్వాంతన వెన్నెల చల్లదనం నుంచే లభిస్తుంది. ప్రజల మిత్రులు ఎవరంటే తనకే సాధ్యమైన రీతిలో చల్లదనాన్ని పంచి పెట్టే చంద్రుడి లాంటి వారే కదా.........

అమ్మ కథ ఆపేసింది.... ఆ రాత్రివేళ, ఒక అందమైన స్వాప్నిక ప్రపంచం హద్దుల్లోకి తీసుకు పోయి మమ్మల్ని అక్కడ వదిలేసింది. చల్లదనపు మహత్తు గురించిన అనుభూతిలో మమ్మల్ని ముంచెత్తింది. కథా శ్రవణం నుంచి, పిల్లలకే సాధ్యమైన మంత్రజగత్తులోంచి మెల్లగా లోకంలోకి వచ్చి పడ్డాం. చుట్టూ చూస్తే వెన్నెల.. పిండారబోసినట్లుగా, అమ్మ మనసును సంతోషపెట్టినట్లుగా, తరతరాలుగా, యుగయుగాలుగా ఒకే బాట.. చల్లదనాన్ని లోకంముందు పరుస్తూ పోతూ వెన్నెల..పిండి వెన్నెల....

కధ విన్నది ముగ్గురు పిల్లలం. నోటిమాటలేదు మాకు. మూగబోయాం. ఆ మహిమాన్విత చంద్రకాంతి చల్లదనంలో తడిసి ముద్దయ్యాం. ఆ కథ వినక ముందు మా జీవితాలకు విన్న తర్వాత ఆ క్షణంలో మా జీవితాలకు ఏదో వార..ఏదో అగాథం..ఏదో వ్యక్తావ్యక్తవేదన... స్వప్న, వాస్తవ ప్రపంచాలకు మధ్య ఏదో తేడా. తెలిసీ తెలియని తేడా....ఆ తేడా ఏమిటి అని మేం కొట్టుమిట్లాడుతున్నాం... ఏం చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కాని స్థితి.

కథ చెప్పినప్పుడల్లా అమ్మ అడుగుతుంది మమ్మల్ని.. ఆ కథలోని నీతి ఏమిటి అని..దాంట్లోంచి ఏం గ్రహించారు అని. మాకు తెలియని, ఆనాటి మా ఊహకు అందని మాటల్లో మెల్లగా గొణిగాం...అమ్మ మనసును కష్టపెట్టకూడదు ఇదే కదా ఆ కథలో ఉన్న నీతి..ముగ్గురు పిల్లలమూ దీనికే ఓటేశాం. అమ్మ చాలాసార్లు మేం గ్రహించిన కథాసారాన్ని ఖండించో లేక ఇంకాస్త సవరించో దాంట్లోని అసలు విషయాన్ని చివర్లో వివరించేది...

కానీ ఆరోజు అమ్మ ఆశ్చర్యకరంగా మా ఓటు వైపే మొగ్గు చూపింది. అదే ఆకథలోని అసలు నీతి అని తేల్చి చెప్పేసింది. ఇన్నాళ్లకు అమ్మ మనస్సును అర్థం చేసుకున్నాం, గెలిచాం అని అనుకుంటున్నాం.. ఇంతలో ఉన్నట్లుండి ఒక ప్రశ్న విసిరింది. "తల్లి మనసుకు కష్టం తగలనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా..."

మా పసిహృదయాలకు ఆరోజు అర్థం కాని ప్రశ్న అది. మూగబోయాం.. మాకే తెలియని ఓ కొత్త నిశ్శబ్దం....తన పాతికేళ్ల నవ యవ్వన మాతృ జీవితంలో పొందిన ఏ బాధాకర అనుభవాలు ఆమెను ఆ క్షణంలో ముంచెత్తాయో... ఆ సమయంలో ఆ కథలోని అమ్మ స్థానంలో తానే ఆవహించిందో... తండ్రితో, భర్తతో, మొత్తం సమాజంతో తన హృదయానికి తూట్లు పడిన గాయాల చరిత్రనే ఆరోజు ఆమె అలా ప్రశ్న రూపంలో వెలువరించిందో..

ఇదీ మేము పుట్టిపెరుగుతున్న రోజుల్లో చందమామ పత్రిక మాకు అందించిన గొప్ప మానవీయ కథ. ఆరోజు మేం ఏం చెప్పాలో తెలీని క్షణాల్లో అమ్మను గట్టిగా హత్తుకుని ఆమె మానుంచి ఏ క్షణాల్లో అయినా జారిపోతుందేమో, దూరమైపోతుందేమో అనే భయాందోళనల మధ్య గడిపాం...

కాని ఈ రోజు.. దాదాపు 30 సంవత్సరాలు దాటాక...ఆ తల్లే మాకు దూరమయ్యాక, సమాజం పట్ల కొంచెంగా పెరిగిన జ్ఞానంతో ఆ ప్రశ్నను కాస్త మార్చి ఇలా చెప్పుకుంటే.. "స్త్రీల మనసుకు కష్టం తగులనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా?"

కాస్తంత విశాలంగా ఆలోచిస్తే..... మనిషికి మనిషికి మధ్య భయంకరమైన అగాధాలు, అంతరాలు, వ్యక్తిత్వ హత్యలు, అహంకారాలు, జీవన విధ్వంసాలు పెచ్చరిల్లుతున్న పాడుకాలంలో... మనిషికి ఎందుకు కష్టం తగులుతోంది. మనిషి మనసు ఎందుకు బాధపడుతోంది..అనే ప్రశ్నలోనే పై ప్రశ్నకు కూడా సమాధానం ఉందేమో మరి.

మహిళలకే కాదు, సమాజంలో ఏ ఒక్కరికీ ప్రశాంతత లేదు. తినడం, సంపాదించడం, చావడమే జీవితచక్రంగా మారి మిగిలిన అన్నివిలువలూ లుప్తమవుతున్న కాలంలో "స్త్రీల మనస్సుకు కష్టం" అనే సమస్య "సమస్త మానవుల కష్టం" అనే మౌలిక సమస్యలోనే దాగి ఉందేమో...

మనిషి జీవితంలో సుఖమే లేదా మరి. అనుబంధాలలో, బాంధవ్యాలలో చల్లదనమే లేదా...చల్లదనాన్ని పంచిపెట్టే గుణమే సమాజంలో హరించుకుపోయిందా.. ఆ తల్లి మొత్తం సమాజానికే ఇంత గాఢమైన ప్రశ్న సంధించి ఉండవచ్చు కాని ఆమె జీవితంలో ఎప్పుడూ ఏ సుఖమూ అనుభవించలేదా... మరీ ఇంత ప్రతికూల ధోరణితో మానవ జీవితంపైనే వ్యాఖ్యానాలు చేయవచ్చా అనే ప్రశ్నలు ఎవరికయినా రావచ్చు...

అయితే మనం మన అవ్వలను, తాతలను, కాటికి సిద్ధంగా ఉన్న కడు వృద్ధులను ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది. నా అనుభవంలో, లోకంలో పుట్టి మహత్కార్యాలు సాధించిన వారు, సాధించకున్నా నిండు జీవితాలను తమ స్థాయిలో తమదైన రీతిలో గడిపి చివరికి మిగిలేదేమిటి అని చివరి పరామర్శకు దిగినవారిని ప్రశ్నించినప్పుడు వారు దాదాపు ఒకేలా సమాధానం ఇచ్చారు.

ఎవరి వద్దకో ఎందుకు తన కూతురు వెళ్లిపోయినా ఇంకా బ్రతికే ఉన్నానంటూ వ్యధ చెందుతున్నప్పటికీ, జీవితసారమిదే, మనం దీనిని భరించాల్సిందే అని చెప్పే మా అవ్వే తన జీవితానుభవాల్లో మానవసారాన్ని ఎత్తి చూపుతుంది. "జీవితంలో సుఖం కన్నా కష్టం పాలే ఎక్కువ. సుఖపడుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం అనుకునే క్షణంలోనే ఏదో ఒక కష్టం మనలను వెన్నాడుతుంది, ముప్పుతిప్పలు పెడుతుంది. దాన్ని భరించడమే తప్ప మనం ఏం చేయలేం.." అనే సాంప్రదాయ జీవన తాత్వికతకు మా అవ్వ ప్రతిరూపంగా కనిపిస్తుంది.

మొత్తం మీద మనిషి జీవితంలో చల్లదనం లేదు. మానవ సమాజంలో చల్లదనం లేదు. ఇదే వాస్తవమైతే మనలో, మనందరిలో ఆ చల్లదనాన్ని రకరకాలుగా హరించివేసే ఉష్ణతాపం రగులుతూ ఉన్నట్లే...ఇక్కడ స్త్రీల మనస్సే కాదు, పురుషుల మనస్సే కాదు, వృద్ధుల మనస్సే కాదు లోకంలో బతికే ఎవరి మనస్సు కూడా చల్లదనంతో లేదన్నదే వాస్తవం. మనిషి జీవితం వేడెక్కుతుందో లేదో చూడాలంటే... ముప్పై ఏళ్లక్రితమే వచ్చిన అపరూప చిత్రం "తాతామనవడు" చూడండి చాలు.

ఆ చిత్రంలో, కాటికి కాళ్లు చాపుకున్న కన్నతండ్రి ఇక ఒక్క క్షణం ఉన్నా కుటుంబానికి భారమే అనే ఉద్దేశ్యంతో సాక్షాత్తూ పుత్రరత్నమే తన ముదుసలి తండ్రికి గొయ్యి తవ్వుతూంటే ఆ పుత్రరత్నపు సుపుత్రరత్నం (తాతకు మనవడు) తన తండ్రికి సైతం గొయ్యి తవ్వాలని బయలుదేరుతాడు.. ఈ ఘోరం ఏమిట్రా తండ్రీ అని వాడి కన్నతండ్రి.... అదే తన తండ్రికి గొయ్యి తవ్వాలని చూసిన కొడుకే తన కుర్రాడిని అడిగితే... ఇదే చెబుతాడు. నీవు నేర్పిన న్యాయమే కదా తండ్రీ, నువ్వు నీ తండ్రికి గొయ్యి తవ్వుతున్నప్పుడు కొన్నాళ్లకయినా నా తండ్రికి నేనే గొయ్యి తవ్వాలి కదా..అందుకని ఇప్పుడే మొదలెట్టేస్తున్నా అంటాడు.

ఇదీ మన జీవితాల్లోని విషాదం, విధ్వంసం, ఉష్ణప్రతాపం. జీవితాల్లో వ్యాపించిన ఈ వేయికోణాల వేడి చల్లబడకుండా, చల్లార్చకుండా మనిషి జీవితం చల్లారుతుందా.. మహిళలకే కాదు ఎవరికైనా చల్లదనం లభిస్తుందా...చల్లదనాన్ని అందరికీ పంచిపెట్టే ఆ మహిమాన్విత కాలం ఎప్పుడొస్తుందని కాదు.. అందరికీ రావాలని ఆశించడంలో తప్పులేదు కదా.. వెన్నెల చల్లదనాన్ని పంచిపెట్టే ఆ చంద్రుడే మనకు సాక్షి, నిదర్శనం కావాలని భావించడం తప్పు కాదు కదా......

చందమామా వర్థిల్లు...

వెన్నెల చల్లదనమా వర్ధిల్లు.......

(1973లో మా అమ్మ మా ముగ్గురు పిల్లలకు చెప్పింది మొదలుకుని ఈ కథ నన్ను జీవితం పొడవునా వెంటాడుతూ వస్తోంది. చందమామ చదవండి జ్ఞానం వస్తుంది అని ఏ మహత్తర క్షణంలో మా నాన్న చందమామను చిన్నప్పుడు మాకిచ్చి చదివించాడో అప్పటినుంచి మా లోకమంతా చందమామకే పట్టం. మా బాల్యాన్ని వెన్నెలతో స్పర్శించిన, పండించిన ఆ చందమామ ఇప్పుడీ నడివయసులో.. నాకు చందమామలోనే ఆన్‌లైన్ ఉద్యోగాన్ని పిలిచి మరీ ఇచ్చింది. పల్లెటూరులో పుట్టిపెరిగిన ఓ చిన్ని జీవితానికి ఇంకేం కావాలి.)